స్విస్‌ ఓపెన్: క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లు దూకుడు కనబరిచారు. స్టార్‌ ప్లేయర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. మూడో సీడ్‌ రాస్మస్‌ గెమ్కేను అజయ్‌ జయరామ్‌ మట్టికరిపించాడు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ చాంపియన్‌ సింధు 21-13, 21-14 తేడాతో ఎల్రిస్‌ వాంగ్‌ పై 35 నిమిషాల్లోనే అలవోక విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ బుసానన్‌తో తెలుగమ్మాయి తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 21-10, 14-21, 21-14 తేడాతో థామస్‌ రౌక్సెల్‌ పై నెగ్గాడు. అయితే మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లోనే స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ 16-21, 21-17, 21-23 తేడాతో చైవాన్‌ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో ఎన్‌.సిక్కిరెడ్డి – పొన్నప్ప జోడీ సైతం పరాజయం పాలైంది.