ముంబై పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2020లో భాగంగా ఆదివారం సాయంత్రం అబుదాబిలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు రాజస్థాన్ భారీ షాక్ ఇచ్చింది. ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న ముంబై ఇండియన్స్ను మట్టికరిపించిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగరవేసింది. బెన్స్టోక్స్ సెంచరీతో ముంబై ఇండియన్స్పై విరుచుకుపడ్డాడు. స్టోక్స్కు సంజూ శామ్సన్ చక్కటి సహకారం అందించడంతో..రాయల్స్ టీమ్ ఘన విజయం సాధించింది. బెన్స్టోక్స్ (107: 60 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు) పరుగులు చేయగా, సంజూ శాంసన్(54 నాటౌట్: 31 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 196 పరుగుల టార్గెట్ ను 18.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 44/2తో కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడి గొప్ప విజయాన్ని అందించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా సిక్స్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా 18, 20 ఓవర్లలో సిక్స్ల మోత మోగించాడు. కేవలం 21 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 7 సిక్స్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 40, ఇషాన్ కిషన్ 37, సౌరభ్ తివారి 34 పరుగులతో రాణించారు.