హాస్పటల్ నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్ .. వారం పాటూ విశ్రాంతి

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి మూడు రోజుల నుంచి అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వైద్యులు పూర్తి స్థాయిలో మరోసారి పరీక్షలు నిర్వహించి.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రజనీకి చేసిన అన్ని వైద్య పరీక్షల్లో రిపోర్ట్స్ నార్మల్‌గా వచ్చాయని వైద్యులు తెలిపారు.

రజనీ పూర్తిగా కోలుకున్నారని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా వైద్యులు వెల్లడించారు. డిశ్చార్జ్‌ అనంతరం హైదరాబాద్‌ నుంచి నేరుగా చెన్నై బయలుదేరారు. అతని వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు.

అన్నాత్తై షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన సూపర్ స్టార్ కొన్ని రోజులుగా ఇక్కడే ఉన్నారు. అయితే షూటింగ్ లో కొందరికి కరోనా రావడంతో వెంటనే రజినీ కూడా అప్రమత్తమయ్యారు. అదే సమయంలో ఈయనకు బిపి కూడా పెరగడంతో వెంటనే అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేసారు. మూడు రోజుల నుంచి అక్కడే ఉన్న ఈయన ఇప్పుడు బయటికి వచ్చేసారు. ఎలాంటి అనారోగ్యం లేదని.. రజినీకాంత్ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. అయితే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వాళ్లు సూచించారు.