వరుస సినిమాలకు ఓకే చెబుతున్న మాస్‌ మహారాజ..

విజయం ఇచ్చే కిక్‌ ఎలా ఉంటుందో ప్రస్తుతం రవితేజను చూస్తే అర్థమవుతోంది. ‘రాజా ది గ్రేట్‌’ తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడీ మాస్‌ హీరో. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’, ‘డిస్కో రాజా’ కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాయి.

దీంతో విజయం తప్పనిసరి అని అనుకుంటోన్న సమయంలో ‘క్రాక్‌’ సినిమాతో వచ్చాడు రవి. ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. లాక్‌డౌన్‌ తర్వాత తొలి భారీ హిట్‌గా నిలించిందీ మూవీ. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో ఫుల్‌ జోష్‌ మీదున్న రవితేజ వరుస సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ఇప్పటికే ‘ఖిలాడీ’తో బిజీగా ఉన్న రవితేజ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. రవితేజ తన 68వ చిత్రాన్ని ఫైనల్‌ చేశాడు. నాని హీరోగా తెరకెక్కిన ‘నేను లోకల్‌’ సినిమా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఫుల్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌తో పాటు ఇతర నటీనముల వివరాలు తెలియాల్సి ఉంది. ‘ఖిలాడీ’ సినిమా పూర్తి అయిన వెంటనే రవితేజ ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.