శిక్షణ ద్వారా చెమట వాసనతో వైరస్ ను గుర్తుపట్టే ప్రత్యేక జాగిలాలు
కరోనాను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే లక్షణాలు బయటపడని రోగులను గుర్తించి చికిత్స అందించవచ్చు. మనిషి స్వేదం వాసన ద్వారా కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోనే అవకాశం ఉంటే… దీనికి అనుగుణంగా అడుగులు వేస్తూ చిలీ పోలీసులు, నాలుగు ప్రత్యేక జాగిలాలను శిక్షణ కోసం ఎంపిక చేశారు. ఇవి.. మనుషుల చెమట వాసన ద్వారా ప్రాథమిక దశలోనే వైరస్ ను గుర్తించగలుగుతాయి. బ్రిటన్లో పరిశోధనలు మంచి ఫలితాలను ఇవ్వడంతో చిలీ పోలీసులు కూడా దేశ రాజధాని సాంటియాగోలో జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జనసమ్మర్థ ప్రదేశాలైన స్కూళ్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఈ జాగిలాలు, వాసన ద్వారా వైరస్ ఉన్న రోగులను గుర్తిస్తాయి. ఫలితంగా ప్రాథమిక దశలోనే వైద్య సేవ లందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని లెఫ్టెనెంట్ కల్నల్, ప్రత్యేక శిక్షణ తరగతుల డైరెక్టర్ క్రిస్టియన్ ఆక్విడో యాన్జీ పేర్కొన్నారు. చెమట ద్వారా కరోనా రోగులను జాగిలాలు గుర్తించే తొలి ట్రయల్ను లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్లో చేశారు.