COVID19 నుంచి కోలుకుని IPL 2020కి రెడీ అయిన: కరుణ్ నాయర్

భారత క్రికెటర్‌ కరుణ్ నాయర్ కరోనా నుంచి కోలుకున్నాడు. ఐపీఎల్ 2020లో కరుణ్ ఆడనున్నట్లు పంజాబ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. అయితే కరుణ్ నాయర్‌కు కరోనా సోకిన విషయాన్ని ఇప్పటివరకూ  రహస్యంగా ఉంచిన మేనేజ్‌మెంట్ రెండు రోజుల కిందట జరిపిన కోవిడ్19 టెస్టులలో నెగటివ్‌గా  రావడంతో విషయాన్ని బయటపెట్టింది. కరోనా సోకిన తొలి భారత క్రికెటర్ కరుణ్ నాయర్.

ప్రొటోకాల్ ప్రకారం ఇదివరకే రెండు సార్లు కరుణ్‌కు కోవిడ్19 టెస్టులు చేసినందున మరో 3 పర్యాయాలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ఆగస్టు 20న యూఏఈకి IPL 2020 కోసం బయలుదేరే సభ్యులలో కరుణ్ నాయర్ కూడా ఉన్నాడని స్పష్టం చేశారు. ఐపీఎల్ 2018, 2019 సీజన్లలో 14 మ్యాచ్‌లాడిన కరుణ్ నాయర్ రెండు హాఫ్ సెంచరీల సాయంతో 306 పరుగులు సాధించాడు. పంజాబ్ జట్టులో కరుణ్ నాయర్ కీలక ఆటగాడు. భారత క్రికెట్ జట్టుకు ఆడిన కరుణ్ నాయర్ సేవలు అవసరమని పంజాబ్ ఫ్రాంచైజీ భావిస్తోంది.