కోలుకుంటున్న గాన గంధర్వుడు

కోవిడ్‌తో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు చరణ్‌ తెలిపారు. ఆయన ఆరోగ్యం ఎలా వుందని అభిమానులు, రాజకీయ, సామాజిక ప్రముఖులు ఆందోళన చెందుతున్న వేళ ఎస్పీ చరణ్ తన తండ్రి ఆరోగ్యం మరింత మెరుగుపడిందని తన వీడియో సందేశంలో తెలిపారు. తన తండ్రి కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్న అందరికీ చరణ్ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా వైరస్‌కు గురైన ఎస్పీ బాలు ఈనెల 5వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. బాలు ఊపిరితిత్తులు కూడా మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగానే ఉందనడానికి సంకేతం లాంటిందేనని డాక్టర్లు చెప్పారు. నాన్న తొందరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. గత కొన్నిరోజులుగా చేస్తున్న ఫిజియోథెరపీకి కూడా ఆయన శరీరం సహకరిస్తున్నట్లు సమాచారం.కాగా, ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు శనివారం బులెటిన్‌ విడుదల చేయలేదు. ఆయన వైద్యానికి బాగా స్పందిస్తున్నారని, త్వరగా కోలుకుని బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం అవుతోంది.