కరోనా కారణంగా ప్రముఖ గాయని లతామంగేష్కర్ బిల్డింగ్ సీల్‌

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ప్రతిరోజూ ఇక్కడ లెక్కకుమించి కేసులు నమోదవుతున్నాయి. అయితే వృద్ధులు, రోగులపై కరోనా ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ నివసిస్తున్న భవనానికి బీఎంసీ సీల్ వేయాలని నిర్ణయం తీసుకుంది.

దీంతో లతా మంగేష్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తాము ఉంటున్న ప్రభుకుంజ్ భవనంలో వృద్ధులు ఎక్కువగా ఉండడంతో భవనం సీల్ చేయనున్నట్టు కాల్ వచ్చిందని ఆమె తెలిపారు. భవనంలో ఉన్న వారంతా వ్యాధి విషయంలో అప్రమత్తంగానే ఉంటున్నారని, దేవుని దయ, అభిమానుల ఆశీర్వాదం వలన మా కుటుంబం కూడా క్షేమంగా ఉందని లతా పేర్కొన్నారు.