రేవంత్‌కు ఓటుకు నోటు కేసులో ఊరట..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయ్యే వరకు.. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా విచారణ పూర్తయ్యే వరకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిలిపివేయాలంటూ గవాయ్, సూర్యకాంత ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎంపీ రేవంత్‌ రెడ్డిపై ప్రధానంగా ఈడీ అభియోగం మోపింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు గురువారం చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఎంపీ రేవంత్‌పై ప్రధానంగా అభియోగం మోపిన ఈడీ అధికారులు.. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బిషప్‌ సెబాస్టియన్‌ హ్యారీ, రుద్ర శివకుమార్‌ ఉదయ్‌సింహా, మత్తయ్య జేరుసలేం, కృష్ణ కీర్తన్‌పై అభియోగాలు మోపారు. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 2015 జూన్‌1న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయడం, లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావాలని అందుకు నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఎల్వీ స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు పెట్టింది.