రాష్ట్రవ్యాప్తంగా 17 వేల పోస్టుల భర్తీ

ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే కోవిడ్ బాధితులకు చికిత్స అందించడం కోసం డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్దం చేసింది.

తాజాగా రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలోని వసతులపై ఆరా తీసిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 వేల పోస్టులను ఈ నెల 7వ తేదీలోగా భర్తీ చేస్తామని తెలిపారు. అటు రెగ్యులర్ వైద్య సిబ్బంది పోస్టులను 10వ తేదీలోపు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కరోనా రోగుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక రాష్ట్రంలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ బెడ్లు, మందులకు కొరత లేదన్న మంత్రి… కోవిడ్ ఆసుపత్రుల్లోనూ, కరోనా కేర్ సెంటర్లలోనూ రోగుల సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు అందుబాటులో ఉంటున్నారని, మంచి భోజనం పెడుతున్నారని తెలిపారు.