హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న సాయి పల్లవి సోదరి

నటి సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన అందచందాలతో పాటు నటనతో తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింటి. అంతేకాదు తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులకు దగ్గరవడం ఆమెకు మాత్రమే చెల్లింది. ఇక అది అలా ఉంటే సాయి పల్లవి చెల్లెలు పూజా కూడా సినీ ఎంట్రీ ఇస్తోంది.

స్టంట్ కొరియో గ్రాఫర్ స్టంట్‌ శివ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్‌గా పూజా కణ్ణన్ ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాలో సముద్రఖని మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. దీనికి ఎ.యల్. విజయ్ కథా సహాకారం అందిస్తున్నాడు. ఇక పూజా కూడా సాయి పల్లవిలా మంచి డ్యాన్సర్. అంతేకాదు అచ్చం అక్కలానే ఉంటుంది. అక్కలానే మంచి డ్యాన్సర్‌ కూడా. ఇక ఈ సినిమా దర్శకుడు స్టంట్ శివ.. గతంలో ‘యమదొంగ’, ‘ఏ మాయ చేశావె’, ‘2.0’, ‘మాస్టర్‌’ వంటి పలు చిత్రాలకు స్టంట్‌ మాస్టర్‌గా చేసాడు. శివకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇందులో శివ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం ‘విరాట పర్వం’ లో నటిస్తోంది. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం. ఈ సినిమాతో పాటు సాయి పల్లవి.. నాగ చైతన్య హీరోగా లవ్ స్టోరి పేరుతో వస్తున్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు.