ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగం డైరెక్టర్లు

సంగం డెయిరీ వ్యవహారంలో చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏసీబీ అరెస్ట్ చేయగా, డెయిరీ యాజమాన్య హక్కులను బదలాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంగం డెయిరీ డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. డెయిరీ స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.19ను రద్దు చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేశారని సంగం డెయిరీ డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. సంగం డెరెక్టర్ల పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

అటు, తనపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నేడు ఆ తీర్పును వెల్లడించే అవకాశాలున్నాయి.