సారుకు తమ కుటుంబం, తన ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలు

‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఒక ఆర్భాటపు కార్యక్రమం చేపట్టారు. గ్రామానికి వెయ్యి మొక్కలు నాటాలని గ్రామాధికారులకు ఆదేశాలిచ్చారు’ అని విజ‌య‌శాంతి చెప్పారు.

‘పాపం వాళ్లే… గతంలో నాటిన మొక్కల బిల్లులే రాలేదని మొక్కల రేటు, ట్రీ గార్డులు, కూలీ ఖర్చులు ఎలా భరించాలని… గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. వేసవి కాలంలో నీళ్లు లేక మొక్కలు బతక్కపోతే తమకు షోకాజులు పంపుతారని ఆవేదన చెందారు. ఇవేవీ సర్కారుకు పట్టలేదు. సారుకు తమ కుటుంబం, తన ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలు’ అని విజ‌య‌శాంతి విమ‌ర్శించారు.

‘గతంలో వేల కోట్ల రూపాయలతో మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేసి చేతులెత్తేశారు. తర్వాత ఉద్యానవన శాఖ అధికారి ఒకరితో సీఎం గారి ఫౌంహౌస్ నివాసంలో కోట్లాది రూపాయల విలువైన పనులు చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి’ అని విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు.

 ‘సమయానికి జీతాలందక ఆర్టీసీ ఉద్యోగులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు వేదనకు గురవుతున్నా… బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నా సర్కారు వారు నిర్లక్ష్యం వీడరు. ఈ అవినీతి, అసమర్థ, అబద్ధాల, విఫల ప్రభుత్వాన్నినదులకు మొక్కులు, నాటి గాలికి వదిలేస్తున్న మొక్కలు… కాపాడతాయని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నట్లుంది. తెలంగాణ పాలకుల ఈ లెక్కలేనితనానికి తగిన గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజలు స్పష్టంగా ఎదురు చూస్తున్నారు’ అని విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు.