60లక్షల టీకా డోసులు పంపించండి: ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

అమరావతి: కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏపీకి మరో 60 లక్షల డోసుల కొవిడ్ టీకాలను పంపాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. టీకా ఉత్సవ్ కార్యక్రమం అమలుపై ప్రధానికి సీఎం లేఖ రాశారు. 45 ఏళ్ల వయసు దాటిన వ్యక్తులకు టీకా వేసేందుకుగానూ వచ్చే మూడు వారాల్లో ఏపీకి 60 లక్షల కొవిడ్ టీకా డోసుల అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ప్రధానిని విజ్ఞప్తి చేశారు. కరోనా నిర్వహణ, వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కార్యాచరణ ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుందని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఒక్క రోజులోనే 6 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసేలా సామర్థ్యాన్ని పెంచుకున్నామని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 14వ తేదీన ఒక్క రోజులోనే 6.28 లక్షల మందికి కొవిడ్ టీకా ఇవ్వగలిగామన్నారు. దీన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నించినా.. టీకాల కొరత కారణంగా ముందుకు వెళ్లలేక పోయామన్నారు. మరోవైపు ఈ నెల 9వ తేదీన రాసిన లేఖకు స్పందించి ఆరు లక్షల డోసుల టీకాను ఏపీకి పంపినందుకు ప్రధానికి జగన్‌ ధన్యవాదాలు తెలిపారు