ఏడో విడత హరితహారం లక్ష్యాలను నిర్దేశించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. జులై 1 నుంచి అమలు చేసే పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా, ఏడో విడత హరితహారం కార్యక్రమంలో అందుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించారు. గ్రామాల్లో ఇంటింటికీ 6 మొక్కలు చొప్పున పంపిణీ చేయాలని తెలిపారు. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

అపరిష్కృతంగా ఉన్న పనులపై అధికారులు పునఃసమీక్ష చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మిల్లుల సంఖ్యను పెంచేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలవాలని అన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను తొలగించడానికి కృషి చేయాలని తెలిపారు. ప్రజలను చైతన్యపరిచి శ్రమదానంలో పాల్గొనేలా చేయాలని సూచించారు.

పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావసరాలకు కేటాయించిన భూమిని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేశారు. రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులను నిర్దిష్టంగా గుర్తించాలన్నారు.