బంగ్లా స్వాతంత్ర్యం కోసం నేను కూడా జైలుకు వెళ్లా… ప్రధాని మోదీ

తన రాజకీయ జీవిత ఆరంభంలో మొట్ట మొదట చేసిన ఆందోళనల్లో బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్యం కోసం చేసిన సత్యాగ్రహం కూడా ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్రమంలో సహచరులతో కలిసి జైలుకు వెళ్లానని ఆనాటి జ్ఞాపకాల్ని మోదీ గుర్తుచేసుకున్నారు. బంగ్లాదేశ్‌ జాతీయ దినోత్సవాలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.

‘‘బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య పోరాటం నా జీవితంలోనూ చాలా కీలకమైంది. నేను, నా సహచరులు కలిసి భారత్‌లో సత్యాగ్రహం చేశాం. బంగ్లాదేశ్‌ విముక్తి కోసం పోరాడే క్రమంలో నేను జైలుకు కూడా వెళ్లాను’’ అని మోదీ తెలిపారు.

ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ జాతిపిత బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ సేవల్ని మోదీ కొనియాడారు. బంగ్లాదేశ్‌ జాతీయ దినోత్సవాల్లో తననీ భాగం చేయడం గౌరవంగా భావిస్తున్నానని మోదీ అన్నారు. బంగ్లా స్వాతంత్ర్యం కోసం ఆ దేశ సైనికులతో పాటు భారత జవాన్లు చేసిన త్యాగాలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు వారి త్యాగాలకు విలువను చేకూర్చే దిశగా సాగుతున్నాయని తెలిపారు.