నరసాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ

21వ తేదీన నరసాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీ జిల్లా నాయకులు, జన సైనికులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగిస్తారు. పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నాయకులు, శ్రేణులు శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటన, కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు. 21వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో సభ మొదలవుతుంది. ఆ రోజే ప్రపంచ మత్స్యకార దినోత్సవం. శ్రీ పవన్ కళ్యాణ్ పలు వేదికలపై మత్స్యకారుల అభివృద్ధి గురించి కాంక్షించారు. పోరాట యాత్రకు గంగ పూజ చేసి శ్రీకారం చుట్టింది మత్స్యకారుల సమక్షంలో శ్రీకాకుళం జిల్లా కపాసుకుర్ది తీరంలోనే. నరసాపురంలోని బహిరంగ సమావేశం వేదిక నుంచి రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీరి జీవనోపాధికి విఘాతం కలిగించే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నెలకొన్న పలు కీలక సమస్యలను జిల్లా నాయకులు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యలను సైతం ప్రస్తావిస్తారని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ డా.పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.