శ్రీ పింగళి వెంకయ్య సేవలను భావి తరాలకు తెలియచేయాలి

భరత జాతి ఆత్మ గౌరవ ప్రతీక మన మువ్వన్నెల జెండా. ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ పుణ్యమూర్తికి హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్వతంత్ర పోరాట కాలంలో ఆసేతు హిమాచలం ప్రజానీకంలో ఉద్యమ స్ఫూర్తిని కలిగించేలా ఒక పతాకం కావాలన్న గాంధీ మహాత్ముని ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీ పింగళి వెంకయ్య గారు మువ్వన్నెల జెండాను రూపొందించారు. స్వతంత్ర్య సమరయోధుడిగా, జాతీయ జెండా రూప శిల్పిగా, విద్య, శాస్త్రీయ రంగాల్లో ఆయన చేసిన సేవలను భావి తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత జాతీయ భావాలు కలిగిన ప్రతి ఒక్కరిపై ఉందని జనసేనాని పేర్కొన్నారు.