దసరా వేళ ప్రత్యేక రైళ్లు

పండుగలకు ఊరెళ్లాలనుకునేవారికి శుభవార్త. పండుగ సీజన్‌ దృష్ట్యా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా స్పెషల్ ట్రైన్స్‌ను అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు పట్టాలెక్కించనుంది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే 42 స్పెషల్ ట్రైన్స్‌ను తిప్పనుంది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలోనే నడవనున్నాయి. వీటిల్లో కొన్ని వారానికి 2,3 రోజులు నడవనుండగా.. మరికొన్ని రోజూ నడుస్తాయి. ఇంకొన్ని వీకెండ్‌లలో నడిచే రైళ్లు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య నారాయణాద్రి, గౌతమి, శబరి, చార్మినార్, బెంగళూరు, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపబోతోంది. అంతేకాకుండా వీటి టికెట్ ధరలు సాధారణ రైళ్ల కంటే 10-30 శాతం మేర ఎక్కువగా ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు:

ప్రతీ రోజూ నడిచే ట్రైన్స్… తిరుమల ఎక్స్‌ప్రెస్, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, గౌతమి ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్, శబరి ఎక్స్‌ప్రెస్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్, హుబ్లీ ఎక్స్‌ప్రెస్

వారంలో ఐదు రోజులు.. విశాఖపట్నం – విజయవాడ డబుల్ డెక్కర్ ట్రైన్

వారానికి మూడు రోజులు.. రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్

వారానికి రెండు రోజులు… జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌(వయా నాందేడ్), తిరుపతి-అమరావతి(మహారాష్ట్ర)

వారానికి ఒక రోజు.. గౌహతి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌-తిరుపతి(వయా విజయవాడ), విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్.. వీటితో పాటు మరికొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదగా నడుస్తాయి.

కొత్తగా ప్రకటించిన 392 రైళ్లు ఏ రూట్లలో నడుస్తాయో జాబితా కూడా విడుదల చేసింది భారతీయ రైల్వే. అయితే టైమింగ్స్ వివరాలను ఆయా జోన్లు వెల్లడిస్తాయి. అయితే రెగ్యులర్ రైళ్ల టైమింగ్స్ ఈ ప్రత్యేక రైళ్లకు వర్తిస్తాయని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది.