కుష్బూ సుందర్పై 30 పీఎస్ల్లో కేసులు..!
దివ్యాంగులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ నాయకురాలు కుష్బు సుందర్పై తమిళనాడులోని వివిధ జిల్లాల్లో పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) బుధవారం తెలిపింది.
కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి తాజాగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సినీనటి కుష్బూ సుందర్.. అయితే, ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించేలా ఉన్నాయి… ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా 30 పోలీస్ స్టేషన్లలో కుష్భూపై ఫిర్యాదు చేశారు..
తాజాగా కుష్భూ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను మానసిక వికలాంగుల పార్టీ నుంచి నిష్క్రమించానంటూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు.. అయితే, ఈ వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానించినట్టేనని అంటున్నారు ఎన్పీఆర్డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్.. దీంతో ఆమెపై దాదాపు 30 పీఎస్లలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారని.. చెన్నై, కంజిపురం, చెంగల్పేట, మధురై, కోయంబత్తూరు, తిరువూర్ తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఏమైనా మాట్లాడే హక్కు కుష్భూకు ఉన్నప్పటికీ.. వైకల్యం, ప్రతికూల చిత్రణను సూచించే పదాలను వాడడం ఆమోదయోగ్యం కాదన్నారు మురళీధరన్.