రామతీర్థంలో ప్రతిష్ఠాపనకు సిద్ధమవుతున్న విగ్రహాలు..

విజయనగరం జిల్లా రామతీర్థంలో దుండగుల చేతిలో ఇటీవల ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్ఠించేందుకు నూతన విగ్రహాలు రెడీ అవుతున్నాయి.  విగ్రహాల తయారీ కోసం దేవాదాయ శాఖ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) విజ్ఞప్తి అందగా, కంచి నుంచి కృష్ణశిలను తెప్పించి ముగ్గురు స్థపతులతో విగ్రహాలను తయారుచేయిస్తున్నారు.

శ్రీరాముడి విగ్రహం పీఠంతో కలిపి మూడున్నర అడుగుల ఎత్తు ఉండగా, సీతమ్మ, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి మూడు అడుగుల పొడవుతో తీర్చిదిద్దుతున్నారు.  నిజానికి విగ్రహాల తయారీకి 15 రోజులు పడుతుందని తొలుత అంచనా వేసినా, అంతకంటే ముందుగానే విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. నేటి సాయంత్రానికే విగ్రహాల తయారీ పూర్తవుతుందని, 21న టీటీడీ శిల్ప తయారీ కేంద్రంలో పూజలు నిర్వహించిన అనంతరం రామతీర్థానికి తీసుకెళ్లి ప్రతిష్ఠించనున్నారనీ సమాచారం.