దివ్యాంగులను హేళన చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం

* వారిలో అపరిమితమైన ప్రతిభ దాగి ఉంది
* జనసేన ప్రభుత్వంలో వారికి చేదోడువాదోడుగా నిలుస్తాము
* అధికారులే దివ్యాంగుల వద్దకు వెళ్లేలా చర్యలు ఉంటాయి
* విశాఖ జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులతో మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్

దివ్యాంగులలో అపరిమితమైన ప్రతిభ ఉంటుంది. వారి సామర్ధ్యానికి తగ్గట్టు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తే ఉన్నత స్థాయికి వెళ్తారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ‘2016 దివ్యాంగుల చట్టం’ సక్రమంగా అమలు చేయడంతోపాటు దివ్యాంగుల పట్ల చులకనగా మాట్లాడినా, అపహాస్యం చేసినా శిక్షపడేలా కొత్త చట్టాలు తీసుకొస్తామ’ని హామీ ఇచ్చారు. జనసేన ప్రభుత్వంలో దివ్యాంగులను గుండెల్లో పెట్టి చూసుకుంటామని, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే దుస్థితిని దూరం చేస్తామని అన్నారు. గురువారం విశాఖపట్నంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులు తమ అవస్థలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “దివ్యాంగులు దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉంటారు. వారిలో అపరిమితమైన ప్రతిభ ఉన్నా ఎందుకో వారంటే సమాజంలో చిన్నచూపు. ప్రభుత్వాలు కూడా వారిపై వివక్ష చూపిస్తాయి. అంగ వైకల్యం కంటికి కనిపిస్తున్నా సర్టిఫికేట్ ఇవ్వరు. సర్టిఫికేట్ ఉన్నా పింఛన్ ఇవ్వరు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో దివ్యాంగులు ఉంటే కేవలం 4 లక్షల మందికే ఈ ప్రభుత్వం పెన్షన్ రూ. 3 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. దివ్యాంగులలో ఉన్నత చదువులు చదువుకున్న వారు, క్రీడాకారులు ఉన్నారు. వారి సామర్థ్యానికి తగ్గట్టు ప్రభుత్వాలు అవకాశాలు కల్పించాలి.
* సమాజాన్ని చైతన్యం చేస్తాం
దివ్యాంగులు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా వివక్ష అనుభవిస్తున్నారు. సమాజంలో వారిపట్ల చులకన భావం ఉంది. ఆ భావన పోగొట్టి, సమాజాన్ని చైతన్య పరిచే బాధ్యత జనసేన తీసుకుంటుంది. విదేశాల్లో దివ్యాంగులను గొప్పగా చూస్తారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు జరుగుతాయి. బస్సుల్లో ప్రత్యేక సీట్లు, ఎక్కేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. అలాంటి రిజర్వేషన్లు మన రాష్ట్రంలో కల్పిస్తాం. దివ్యాంగుల్లో ఆత్మనూన్యత భావం పోగొట్టేందుకు వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు దివ్యాంగుల క్రికెట్ టీమ్ కు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చాను. అంగ వైకల్యంతో పుట్టిన పిల్లలను చాలా మంది తల్లిదండ్రులు రోడ్డు పక్కన వదిలేస్తే చాలా ఆర్గనైజేషన్లు వారిని తెచ్చి పెంచుతున్నారు. అలాంటి ఆర్గనైజేషన్లకు జనసేన ప్రభుత్వంలో అండగా ఉంటాం. అప్పు చేసైనా వాళ్లను పోషిస్తాం. ఉన్నచోటే సంపాదించుకునేలా తోడ్పాటు అందిస్తామని” హామీ ఇచ్చారు.
* సమస్యలు ఏకరువు పెట్టిన దివ్యాంగులు
విశాఖ జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులు తమ సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట ఏకరువు పెట్టారు. సుమారు 30 మంది దివ్యాంగులు జనవాణిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు రాగా, శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి వద్దకు వెళ్లి పేరు పేరునా పలుకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున శ్రీ ఎం. సురేష్ పలు అంశాలు ప్రస్తావించారు. రూ. 3 వేల ఫించన్ మినహా వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు ఎలాంటి సంక్షేమం జరగడం లేదని వాపోయారు. 2016 దివ్యాంగుల చట్టంపై అధ్యయనం చేసి అమలుకు కృషి చేయాలని కోరారు. దివ్యాంగురాలైన అనాథ చిన్నారిని పెంచుకుంటున్న శ్రీమతి సూర్యకాంతం అనే వృద్ధురాలు తాను పెంచుకుంటున్న చిన్నారికి పెన్షన్ ఇప్పించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీహెచ్ లో 11 సంవత్సరాలుగా పని చేస్తున్న తమను తొలగిస్తున్నట్టు ఉన్నపళంగా నోటీసులు ఇచ్చారని దివ్యాంగులు జి. నాగమణి, ఎన్. వెంకటలక్ష్మిలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించారు. జీతం పెంచకపోగా వైసీపీ ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని వాపోయారు. రిచా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలైన దివ్యాంగులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. మానసిక, అంగ వైకల్యంతో బాధపడుతున్న ఆ చిన్నారులతో కొంత సమయం గడిపి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఓ చిన్నారి తమిళంలో అయ్యప్ప పాటలు పాడుతుందని తెలిసి.. తమిళంలో సంభాషించి పాట పాడమని అడిగారు. వైకల్యం ఉన్న చిన్నారులకు సైతం ఫించన్ ఇవ్వడం లేదని, అనాథలకు రేషన్ కార్డులు ఎక్కడి నుంచి తెస్తామని ఫౌండేషన్ సభ్యులు వాపోయారు. దివ్యాంగులపట్ల మానవతా దృక్పథంతో సంక్షేమ పథకాలు అందించాలని కోరారు.