భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి: జనసేనాని

భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. ఈ మేరకు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధుల్ని ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఏపీలో 22 లక్షల మంది రిజిస్టర్డ్‌ నిర్మాణ కార్మికులు ఉన్నారని వారంతా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్దికంగా ఇబ్బందులు పడుతుంటే కార్మికుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పవన్‌ విమర్శించారు. నిర్మాణ రంగ కార్మికులకు అందిన సాయం శూన్యమని తెలిపారు. నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన 450 కోట్ల రూపాయల్ని వైసీపీ సర్కారు కార్మిక సంఘాల్ని కూడా సంప్రదించకుండా నిధుల్ని దారి మళ్లించిందని ధ్వజమెత్తారు. కార్మికుల నిధుల మళ్లింపుపై ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. వైసీపీ సర్కారు పనితీరు రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. నిధుల మళ్లింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు.