ఏపీ సర్కార్ కి సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్.. ఒక్కరు చనిపోయినా రూ.కోటి పరిహారమివ్వాలి

ఇంటర్‌పరీక్షలను జులైలో నిర్వహించేందుకు అనుమతివ్వాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని, సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. జులై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కానీ నిర్ధిష్టమైన తేదీని చెప్పలేదని పేర్కొంది. 15 రోజుల ముందుగా టైం టేబుల్‌ ఇస్తే…ఆ సమయం సరిపోతుందని ఎలా చెప్తారని ప్రశ్నించింది. ” పరీక్షల నిర్వహణకు సహకరించే ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలేవీ ఇవ్వలేదు. ప్రభుత్వమే అన్ని రకాల లాజిస్టిక్‌ వసతులు కల్పించాలి. విద్యార్థులకే కాదు.. సిబ్బందికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది” అని సుప్రీం వ్యాఖ్యానించింది.

సరైన గాలి, వెలుతురు ఉండే పరీక్షలు నిర్వహించే గదుల వివరాలేవీ అఫిడవిట్‌లో లేవని చెప్పింది. ఏపీ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం సుమారు 28వేల గదులు అవసరం అవుతాయని అభిప్రాయపడింది.

రెండో దశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారాచూశాం కదా.. అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించింది.

” ఒక్కో గదిలో 15-20 మంది విద్యార్థులు ఎలా పరీక్ష రాయగలుగుతారు. వేలకొద్దీ పరీక్ష గదులను ఎలా అందుబాటులోకి తీసుకొచ్చి, సమన్వయం చేయగలుగుతారు. పరీక్ష నిర్వహించాము.. పని అయిపోయింది అనుకోలేము కదా. పరీక్ష తర్వాత వాటిని మూల్యాంకనం చేయాలి, ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుంది.. ఇవేమీ మీ అఫిడవిట్ లో కనిపించలేదు. రెండో దశ తీవ్రతను చూసి.. పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెపుతున్నా.. ఎందుకు ఇలా వ్యవహారిస్తున్నారు” అని సుప్రీం వ్యాఖ్యానించింది. ఒక నిర్ణణాత్మక ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడింది. అవసరమైతే సీబీఎస్ఈ, యూజీసీ, ఐసీఎస్ఈ బోర్డుల సలహాలు తీసుకోవాలని సూచించింది. గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే అయినప్పటికీ, పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని చెప్పింది.

కొంత సమయం ఇస్తే.. చర్చించి ప్రభుత్వం నిర్ణయం వెల్లడిస్తామన్న ఏపీ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని, ఈ వ్యవహారం విద్యార్థులపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మూడో వేవ్ వస్తే అప్పుడు ఏం చేస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.