ఎస్.వి.ఆర్ అభినయం అనితర సాధ్యం: పవన్ కళ్యాణ్

నటనకు నిలువెత్తు నిదర్శనం ఎవరయ్యా.. అంటే ఖచ్చితంగా ఎస్.వి. రంగారావు పేరు వినబడుతుంది. ఆయన ఏ పాత్ర వేసినా.. ఆ పాత్రకు జీవం పోసేవారు. మరెవ్వరూ ఆ పాత్రని అంతలా పోషించలేరనేలా.. కీర్తిని గడించిన ఎస్.వి. రంగారావు జయంతి సందర్భంగా నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరపున.. ఎస్.వి.ఆర్.ను స్మరించుకుంటూ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.

”తెలుగు చలనచిత్రాన్ని పరిపుష్టం చేసిన మహానటుల్లో అగ్రగణ్యులు శ్రీ ఎస్.వి.రంగారావు గారు. చిన్నపాటి మాటను ప్రభావశీలమైన హావభావంతోనో.. కఠిన సమాసాలతో కూడిన ఎంత పెద్ద సంభాషణనైనా అలవోకగా పలికి మొత్తం సన్నివేశాన్ని రక్తి కట్టించిన ప్రతిభాశీలి శ్రీ ఎస్.వి.ఆర్. గారు. ఆయన జయంతి సందర్భంగా ఏ మాధ్యమంలో చూసినా ఆయన నటించిన చిత్రాలు… వాటి విశేషాలే. వాటిని చూస్తుంటే ఎస్వీఆర్ గారు మన సినిమాపై ఎంతటి బలమైన ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా శ్రీ ఎస్వీఆర్ గారిని స్మరించుకొంటూ వారికి నా తరఫున, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నాను. పౌరాణికం, చారిత్రకం, జానపదం, సాంఘికం… ఏ తరహా పాత్ర పోషించినా వారి అభినయం అనితర సాధ్యం. నిండైన ఆయన రూపం ప్రతి తెలుగువాడి మదిలో చిరస్థాయిగా నిలిచే వుంది.

ప్రతినాయకుడిగా.. క్యారెక్టర్ నటుడిగా.. ఏ పాత్రకైనా జీవం పోసి ఆ పాత్రకు ఎస్వీఆర్ గారు తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు అనే విధంగా చేశారు. కాబట్టే నేటికీ ఘటోత్కచుడిగా.. కీచకుడిగా.. నేపాళ మాంత్రికుడిగా.. హిరణ్యకశిపుడిగా.. అక్బర్.. భోజరాజు.. తాండ్ర పాపారాయుడు.. తాతామనవడు తాతగా.. ఏ పాత్రలో అయినా ఎస్వీఆర్ మాత్రమే గుర్తుకొస్తారు. ఒక నటుడిగా శ్రీ ఎస్వీఆర్ గారు చిరకీర్తిని ఆర్జించారు. ఆయనను రాబోయే తరాలు కూడా స్మరించుకొంటూనే ఉంటాయి..” అని ఈ ప్రెస్‌నోట్‌లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.