యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్రపు పూజలు..

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సంప్రదాయరీతిలో విశేష పూజలు కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయంలోని కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కల్యాణ మండపంలో 108 కలశాలకు పూజలు జరిపారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవ మూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్ర నామార్చనలు జరిపారు.

సాయంత్రం స్వామి అమ్మవార్లను రథసేవలో తీరిదిద్ది బాలాలయ మండపంలో ఊరేగించనున్నారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు వేకువ జామునే గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.