భారతదేశ అభివృద్ధిలో టాటా పాత్ర కీలకం

భారతదేశ అభివృద్ధిలో టాటా గ్రూప్‌ కీలకపాత్ర వహించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. అసోచామ్‌ ఫౌండేషన్‌ వీక్‌ 2020 కార్యక్రమంలో మోదీ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వందేళ్లలో ఇండస్ట్రీ ఛాంబర్‌ భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంతో సహా భారత అభివృద్ధికి సాక్షిగా నిలిచిందన్నారు. దేశపురోగతిలో భాగంగా వాణిజ్య సహకారాన్ని అందించినందుకుగాను ‘అసోచామ్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఆఫ్‌ ద సెంచరీ’ అవార్డును టాటా ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ రతన్‌టాటాకు అందించారు.

అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారతదేశ అభివృద్ధిలో టాటా గ్రూప్‌ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. అనంతరం రతన్‌టాటా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన కష్టసమయంలో దేశాన్ని ముందుండి నడిపించినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎదురైన వ్యతిరేకత, ఆటుపోట్లను తట్టుకొని దేశాన్ని ఏకతాటిపై నడిపించారన్నారు. ప్రధాని చెప్పిన సూచనలు, జాగ్రత్తలు పాటించి ఉంటే ఇప్పటికి భారత్‌ కరోనా రహిత దేశంగా ఉండి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిఉండేదని ఆయన తెలిపారు.