స్కూళ్ల రీ-ఓపెన్‌పై తెలంగాణ కీలక నిర్ణయం

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతుల వరకు నేరుగా ప్రమోట్‌ చేసే అవకాశం ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

లాక్‌ డౌన్ తర్వాత అన్ని ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నాయి. కానీ విద్యాసంస్థల విషయంలో గందరగోళం మాత్రం వీడడం లేదు. పాఠశాలలు తెరిచినా పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకటి నుంచి 5 తరగతులకు స్కూళ్లు తెరవకూడదని నిర్ణయం తీసుకుంది.

స్కూళ్లను ప్రారంభిస్తే.. పిల్లలు సోషల్‌ డిస్టెన్స్ పాటించడం అసాధ్యం. పిల్లలు వైరస్ బారినపడితే సమస్య తీవ్రతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఐదో తరగతి వరకు బడులు ప్రారంభించకపోవడమే మంచిదని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఆరు నుంచి 8 తరగతులకు పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకోనున్నారు. 9-10 తరగతుల విద్యార్థులకు మాత్రం కనీసం 90 రోజులు, గరిష్ఠంగా 120 రోజులపాటు ప్రత్యక్ష బోధన అందించాలని భావిస్తున్నారు.