ఏపీ దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో వున్న అన్ని దేవాలయాలను ఒకే వ్యవస్థ కిందికి తీసుకువచ్చేందుకు సంకల్పించింది. ఈ క్రమంలో సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను ప్రారంభించారు. దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉపయోగపడుతుందని వెల్లడించారు. పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకతతో కూడిన వ్యవస్థలు ఉండాలన్నదే తమ అభిమతమని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇకపై దేవాలయాల సమాచారం, భక్తులకు అవసరమైన సేవలు, ఆన్ లైన్ సేవలతో పాటు ఆలయాల ఆదాయ వ్యయాలు, సిబ్బంది వివరాలు, ఆలయాల పూర్తి వివరాలు, పండుగ దినాల నిర్వహణ, పర్వదినాలు-ఉత్సవాల క్యాలెండర్, ఆస్తుల నిర్వహణ తదితర అంశాలన్నీ ఇకపై టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో భాగం కానున్నాయని వివరించారు. ఇందులోనే ఇ-హుండీ సదుపాయం కూడా కల్పించారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా భక్తులు ఇ-హుండీలో కానుకలు సమర్పించవచ్చు.