ఫేస్‌బుక్ ఒత్తిడికి తలొగ్గిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

ఆస్ట్రేలియా న్యూస్ పేజీలపై తాము విధించిన నిషేధాన్ని రానున్న రోజుల్లో ఎత్తేస్తామని ఫేస్‌బుక్ మంగళవారం ప్రకటించింది. తాము తీసుకొచ్చిన మీడియా చట్టాన్ని సవరించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించడంతో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త చట్టం ప్రకారం కంటెంట్ వాడుకుంటున్నందుకు ఫేస్‌బుక్.. మీడియా సంస్థలకు డబ్బు చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ఫేస్‌బుక్‌.. అక్కడి న్యూస్ పేజీలపై నిషేధం విధించింది. అయితే ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మరోసారి ఆ సంస్థ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు.

తాజా చర్చల్లో చట్ట సవరణకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో తాము న్యూస్ పేజీలపై నిషేధం ఎత్తేస్తున్నట్లు ఫేస్‌బుక్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఈస్టన్ వెల్లడించారు. ఫేస్‌బుక్ సడెన్‌గా తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో దిగొచ్చిన ప్రభుత్వం ఫేస్‌బుక్‌ను చర్చలకు ఆహ్వానించింది. ఆ సంస్థ తమకు మళ్లీ ఫ్రెండ్ అయిందని ప్రధాని మోరిసన్ చెప్పారు.