ఢిల్లీలో దిగొస్తున్న పాజిటివిటీ రేటు.. అన్‌లాక్ ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధం

ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షల ఫలితంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివిటీ రేటు 2 శాతం దిగువకు దిగొచ్చింది. దీంతో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 31 నుంచి దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.

ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్ 31వ తేదీ ఉదయం ఐదు గంటల వరకు కొనసాగుతుందని , ఆ తర్వాత నెమ్మదిగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. దినసరి కార్మికులను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ రంగ కార్యకలాపాలను, పరిశ్రమలను తిరిగి తెరుస్తామని సీఎం వివరించారు. ప్రజలెవరూ ఆకలితో చనిపోకుండా చూసేందుకే అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

కాగా, ప్రస్తుతం ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 1.5 శాతానికి పడిపోయింది. ఒకప్పుడు 36 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 2 శాతం దిగువకు పడిపోవడంలో లాక్‌డౌన్ ఎంతగానో ఉపకరించింది.