తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఈ నెల 26న ముహూర్తం

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జాతరకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే 3,60,000 పైచిలుకు లబ్దిదారులకు రేషన్ కార్డులు అందించనున్నారు. ఈ క్రమంలో, కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల 26 నుంచి షురూ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని కొత్త రేషన్ కార్డుకు అర్హత పొందిన వారికి, ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని వెల్లడించారు. జులై 26 నుంచి 31 వరకు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు దిశానిర్దేశం చేశారు.

కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు ఆగస్టు మాసం నుంచే బియ్యం అందజేయాలని సూచించారు. బియ్యం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను ఆదేశించారు.