ఎనిమిది నెలలు పూర్తి చేసుకున్న రైతు ఉద్యమం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది. గతేడాది నవంబర్‌ 26న మొదలుపెట్టిన ఈ ఉద్యమం 240 రోజులుగా సింఘా, టిక్రీ, ఘాజీపూర్‌, షాజహాన్‌ పూర్‌, పల్వాల్‌ సరిహద్దుల్లో కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా జంతర్‌మంతర్‌ వద్ద సోమవారం మహిళా రైతుల ‘కిసాన్‌ సంసద్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌ తికాయత్‌ మాట్లాడుతూ.. ‘రైతులందరూ మరోసారి ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు. ట్రాక్టర్‌ ర్యాలీ అనేది తప్పుడు విషయమేమీ కాదు. హర్యానాలోని జింద్‌ వాసులు సరైన నిర్ణయమే తీసుకున్నారు. ఆగస్టు 15న మరోసారి చేపట్టాలనుకుంటున్నా. సంయుక్త్‌ కిశాన్‌ మోర్చా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. జాతీయ జెండాలను పెట్టుకుని ర్యాలీలో పాల్గొనాలి’ అని ఆయన అన్నారు.

కొత్తగా ఆమోదం పొందిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు (ఎంఎస్‌పి)కు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.