తెనాలిలో జనసేన జెండా ఎగురుతుంది

• 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన గెలుస్తుంది
• శ్రీ నాదెండ్ల మనోహర్ చిత్తశుద్ధి… నిబద్ధతను తెనాలి ప్రజలు ఎన్నటికీ మరచిపోరు
• ఆయన నాయకత్వ లక్షణాలు… నియోజకవర్గ అభివృద్ధి కోసం తపించే విధానం ప్రజలకు అవసరం
• వైసీపీ నాయకుడికి దోపిడీ అనేది పుట్టుకతో వచ్చిన బుద్ధి
• రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన నిబద్ధతతో నిలబడి ఉంది
• కచ్చితంగా సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాధించి తీరుతాం
• తెనాలి నియోజకవర్గ నాయకులతో ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది… అక్కడ సీటూ, గెలుపూ మనదే అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. తెనాలి నుంచి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో శ్రీ మనోహర్ గారు అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి సమర్థ నాయకుడినీ, ఎన్నుకున్న నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధినీ తెనాలి ప్రజలు ఎప్పటికీ మరచిపోరు అని చెప్పారు.
మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ పార్టీ నాయకులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆత్మీయంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులను ఒక్కక్కరినీ శ్రీ మనోహర్ గారు పరిచయం చేశారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శ్రీ మనోహర్ గారు తన హయాంలో చేసిన సేవలను తెనాలి నియోజకవర్గం ప్రజలు విస్మరించలేదు. ఇప్పటికీ నియోజకవర్గం అభ్యున్నతి కోసం తపిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెనాలికి ఆయన అవసరం ఉంది. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా పాలక పక్షం ఆలోచిస్తుంది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు అంటారు.. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు… నేను బాగుండాలి.. నేనే బాగుపడిపోవాలి అనేది వైసీపీ నాయకుడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి. దాన్ని నేనెప్పుడో గ్రహించాను కాబట్టే మొదటి నుంచీ వైసీపీని వ్యతిరేకిస్తున్నాను. ప్రజలు మాత్రం ఎంతో సానుభూతితో తండ్రి లేని పిల్లాడు.. సంవత్సరం నుంచి నడుస్తున్నాడని జాలితో ఓట్లు వేశారు. ఇప్పుడు దానికి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడుతున్నారు.
• వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం
ఆంధ్రప్రదేశ్ కు స్థిరత్వం ఇవ్వాలని బలమైన కాంక్షతోనే జనసేన పార్టీ పనిచేస్తుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి అనేదే ప్రాథమిక ఎజెండాగా ఎలా ఎదగాలన్నది నాయకులు పట్టించుకోలేదు. కేవలం వారి వ్యక్తిగత ఎదుగుదల తప్ప, ప్రజా క్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయం మీద నిబద్ధతతో నిలబడి ఉంది. నేను ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినా, ఇక్కడ మాట్లాడినా విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి వైపు వెళ్లాలనే అంశాలు, కేంద్రం అందించాల్సిన సాయం మీద మాట్లాడుతాను. మేం చెప్పే ప్రతి మాట రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని చెబుతున్నదే. అర్ధశాస్త్రంలో పన్నులను ఎలా విధించాలనే అంశంపై నిపుణులు చెబుతూ ‘పూల మీద మకరందం తీసుకునే సీతాకోకచిలుకలా ప్రభుత్వం పన్నుల విషయంలో వ్యవహరించాల’ని తెలిపారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. చెత్తపైనా పన్ను వేసిన ప్రభుత్వం ఇది. ప్రజలపై ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వేస్తూ, ఆ డబ్బుతో సంక్షేమం అంటే ఎలా..? అది ఎలా ప్రజలకు మేలు చేస్తుంది..? ఓ పద్ధతి లేకుండా చేస్తున్న వైసీపీ పాలన వల్ల రాష్ట్రం పది అడుగులు వెనక్కు వెళుతున్నాం. ప్రజలు కులం, మతం, ప్రాంతం దాటి ఆలోచించకపోతే పూర్తిగా రాష్ట్ర ప్రజల ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ పాలనపరమైన ఇబ్బందులు అలాగే ఉన్నాయి. మన వ్యవస్థ ఇప్పటికీ సర్దుబాటు కాలేదు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఎలాంటి అరమరికలు లేకుండా సాఫీగా పాలన సాగించలేని స్థితిలో ఉండిపోయాం’’ అన్నారు.
• నిజాయతీగల వ్యక్తుల సమూహం జనసేన : శ్రీ నాదెండ్ల మనోహర్
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “పార్టీలో నిజాయతీనే బలంగా చేసుకున్న నాయకులే కనిపిస్తారు. అరమరికలు లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లేలా పనిచేయాలి. అందరినీ సమన్వయం చేసుకోవాలి. ప్రస్తుతం కొత్త ఓట్ల చేర్పులు, మార్పులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆయా నియోజకవర్గాల్లో ఓట్లను తనిఖీ చేయండి. ఇంటింటి తనిఖీ అవసరం ఉంది. తెనాలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధిని అందరూ గుర్తు చేసుకుంటారు. వచ్చే జనసేన ప్రభుత్వంలో తెనాలి నుంచి గెలిస్తే నియోజకవర్గంలో అద్భుతమైన పనులు ఎలా చేస్తామో ప్రజలకు తెలియచేద్దాం. కచ్చితంగా అన్ని వర్గాలవారూ జనసేన వైపు చూస్తున్న సమయంలో అందరం సమష్టిగా పని చేసి, విజయతీరాల వైపు పయనిద్దాం.
• ఎవరికీ మనశ్శాంతి లేదు: తెనాలి నియోజకవర్గం నాయకులు
ఈ సమావేశానికి హాజరైన తెనాలి నియోజకవర్గం నేతలు వివిధ అంశాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. “వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గానికి మనశ్శాంతి లేదు. ఆఖరికి ఆ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు సైతం ఇదేమి ప్రభుత్వం అని తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. గ్రామాభివృద్ధికి రావాల్సిన నిధులు రావడం లేదు. సొంత డబ్బులతో చేసే పనులకు బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తలెత్తుకునే పరిస్థితి కూడా లేదు. గ్రామ స్వరాజ్యం పోయి జగన్ రాజ్యం వచ్చింది. ఇష్టారీతిన దోపిడీ.. అడిగితే దాడులు అన్నట్లు గ్రామాల్లో రౌడీరాజ్యం నడుస్తోంది. గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులూ లేవు. ఉపాధి లేదు” అన్నారు. క్షేత్రస్థాయిలోని వైసీపీ పాలన అరాచకాలను కళ్లకు కట్టినట్లు ఉంచారు. అన్ని విషయాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆసక్తిగా విని నోట్ చేసుకున్నారు.