ఏపీ మంత్రి వర్గ సరికొత్త నిర్ణయాలు

ఏపీ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం మంత్రి వర్గం సమావేశమైంది. ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ చట్టంలో సవరణలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా వైఎస్సార్ ఆసరా పథకానికి ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా 9 లక్షల 33 వేల డ్వాక్రా గ్రూపులకు లబ్ధి చేకూరనుంది. మొదటి ఏడాది రూ.6,792 కోట్ల లబ్ధి లభించనుంది.

నాలుగేండ్ల లో 27 వేల 168 కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది. డ్వాక్రా గ్రూపులను ఆర్థికంగా పరిపుష్టి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇక జగనన్న విద్యాకానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్ల పంపిణీ చేయనున్నది. 42 లక్షల 32 వేల మందికి వచ్చే నెల 5న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే గర్భిణీలు, బాలింతలు, పిల్లల కోసం వచ్చే నెల 1న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి శ్రీకారం చుట్టనుంది.

వీటితో పాటు డిసెంబర్ ఒకటి నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. 9, 260 వాహనాల ద్వారా ఇంటివద్దనే తూకం వేసి బియ్యం పంపిణీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువకులకు వాహనాలు సబ్సిడీపై అందజేయనుంది. అలాగే 583 కోట్లతో బియ్యం కార్డుదారులకు వైఎస్సార్ భీమా పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త పారిశ్రామిక విధానానికి కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఏపీ బల్క్ డ్రగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.