ఐఐఎం క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని
ఒడిశాలోని సంబల్పూర్ ఐఐఎం ( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి మిత్రులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన ట్విటర్లో పిలుపునిచ్చారు. జాతీయాభివృద్ధిలో ఐఐఎంల పాత్ర గర్వకారణమని పేర్కొన్నారు.
ఒడిశా గవర్నర్ గణేషీలాల్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి రమేశ్ పొక్రియాల్, ధరేంద్ర ప్రధాన్, ప్రతాప్ చంద్ర సారంగి సైతం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. వర్చువల్ విధానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అధికారులు, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, ఐఐఎం సంబల్పూర్ అధ్యాపకులు, సిబ్బంది పూర్వ విద్యార్థులు మొత్తం 5 వేల మంది పాల్గొననున్నారు.