హాని తలపెడితే రాష్ట్రం సుడిగుండమే: డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను అనుమానాస్పద వ్యక్తులు ఈ మధ్య ఎక్కువగా అనుసరిస్తున్నారని, ముఖ్యంగా విశాఖ సంఘటన తరువాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు తచ్చాడుతున్నారని నియోజకవర్గ ఇంచార్జి డా.యుగంధర్ పొన్న తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని, కారులోని వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలియజేసారు. అనుసరిస్తున్నవారు అభిమానులు ఎంత మాత్రం కాదని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బుధవారం కారులోనూ, మంగళవారం నాడు ద్విచక్రవాహనాలపై అనుసరించారని, సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని, ఇంటికి ఎదురుగా వారు కారు ఆపారని, సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ, పవన్ కళ్యాణ్ ను దుర్భాషలాడుతూ గొడవ చేశారని తెలిపారు. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని అయినా సంయమనం పాటించిన సిబ్బంది ఈ సంఘటనను వీడియో తీసి జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్ కి అందించగా ఆయన జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బుధ్వారం పిర్యాదు చేశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని వాళ్లకు తెలిసిపోయిందని అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు హాని తలపెడితే రాష్ట్రం సుడిగుండం అవుతుందని, ఈ దుండగుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, దీని వెనుక ఎవరున్నారు సంబంధిత అధికారులు నిగ్గు తేల్చాలని, కఠినమైన శిక్ష విధించాల్సిందిగా, అదేవిధగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.