గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుంది: సీడీసీ
కరోనా రోగి నుంచి ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉన్నా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని చెందుతుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడిన తుంపర్లలో వైరస్ ఉంటుందని, అది గాలి ద్వారా ప్రయాణిస్తుందని తెలిపింది. వ్యక్తుల మధ్య కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించింది. గాలి, వెలుతురు సక్రమంగా ప్రసరించని గదుల్లో ఆరడుగుల కంటే ఎక్కువ దూరం వరకు కూడా వైరస్ ప్రయాణించవచ్చని వివరించింది. కాగా గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని సీడీసీ గతంలోనూ తన వెబ్సైట్లో పేర్కొంది. అయితే, గాలిలో వైరస్ వ్యాప్తిపై భిన్నాభిప్రాయాలు రావడంతో ఆ సమాచారాన్ని తొలగించింది. తాజాగా ఈ విషయాన్ని నిర్ధారించింది. తాజా పరిణామాలతో వ్యాపార సంస్థలు, పాఠశాలల పునఃప్రారంభానికి కొత్త సవాల్ ఎదురవుతోంది.