TIDCO: ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందిస్తాం: మంత్రి బొత్స

పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నెల్లూరులోని భగత్‌సింగ్‌ నగర్‌లో టిడ్కో ఇళ్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌ శుక్రవారం ప్రారంభించారు. కొంతమంది లబ్ధిదారులకు ఇంటి తాళాలను మంత్రులు అందచేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2 లక్షల 60 వేల టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని తెలిపారు. మరో 18 నెలల్లో అన్ని చోట్లా టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పేదలపై భారం వేయాలని చూసిందని విమర్శించారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ… గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం పేదల వద్ద డబ్బు కట్టించుకుని మోసం చేసిందన్నారు. పేదలపై భారం పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వమే వాటిని భరిస్తోందని మంత్రి అనిల్‌ అన్నారు.