రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చిన శ్రీవారు..

తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. రెండోరోజైన గురువారం రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో తిరుమలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా శ్రీవారిని ఆలయం నుంచి తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తూ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.

పుష్కరిణి వద్ద అర్చకులు స్వామివారికి హారతులిచ్చి ప్రదక్షిణ ప్రారంభించారు. రెండో రోజు స్వామి, అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు.ఈ సందర్భంగా శ్రీవారు తెప్పలపై కనులపండువగా ఊరేగారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభమైన తెప్పోత్సవాలు ఈ నెల 28న పౌర్ణమి వరకు సాగనున్నాయి. రేపు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిగా శ్రీవారు తెప్పలపై విహరించనున్నారు.

మొదటి రోజు…

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.