Tokyo Olympics: బ్యాడ్మింటన్ లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

తెలుగుతేజం పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ లో అదరగొట్టింది. ఇవాళ జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో జపాన్ అమ్మాయి అకానే యమగూచిని చిత్తుగా ఓడించిన సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్వార్టర్ ఫైనల్ పోరులో సింధు 21-13, 22-20తో వరుసగా రెండు గేమ్ లు గెలిచి యమగూచిని మట్టి కరిపించింది. 

తొలిగేమ్ లో యమగూచిని బలమైన స్మాష్ లు, తెలివైన ప్లేసింగ్ లతో బెంబేలెత్తించిన సింధుకు రెండో గేమ్ లో కాస్తంత ప్రతిఘటన ఎదురైంది. అయితే, అద్భుత ఆటతీరుతో పుంజుకున్న సింధు తన ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా గేమ్ ను, తద్వారా మ్యాచ్ ను కైవసం చేసుకుంది. ఇక సెమీఫైనల్లో గెలిస్తే సింధుకు పతకం ఖాయం అవుతుంది.