Paralympics: టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన భవీనాబెన్ పటేల్

జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో సంచలనం నమోదైంది. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ ఫైనల్‌కు చేరుకుంది. ఫలితంగా పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది.

 నిన్న బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్‌లో 3-0తో అద్వితీయ విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన భవీనాబెన్.. ఆ తర్వాత ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది.

తాజాగా, చైనాకు చెందిన మియావో జాంగ్‌‌తో జరిగిన సెమీఫైనల్‌లో 3-2తో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఫలితంగా పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. రేపు ఉదయం 7.15 గంటలకు చైనాకు చెందిన ఝౌ యింగ్‌తో భవీనా ఫైనల్‌లో తలపడనుంది.