ఇండియాకు తిరిగొస్తున్న ఉమేశ్యాదవ్..
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్.. ఆస్ట్రేలియా టూర్ నుంచి మధ్యంతరంగా స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మెల్బోర్న్లో జరిగిన రెండవ టెస్టులో.. ఉమేశ్యాదవ్ గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో అతన్ని మిగితా మ్యాచ్ల నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో అతను తిరిగి ఇండియాకు వెళ్తున్నట్లు ఓ వార్త సంస్థ తన కథనంలో పేర్కొన్నది. అయితే ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరిగే సిరీస్కు ఉమేశ్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మెల్బోర్న్ టెస్టులో రెండవ ఇన్నింగ్స్లో బౌలింగ్ వేస్తూ ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. అతని కాలి పిక్కలు పట్టేసినట్లు తెలుస్తోంది. స్కానింగ్ తీసిన తర్వాత ఉమేశ్.. మూడవ, నాలుగవ టెస్టులకు దూరం కానున్నట్లు టీమ్ యాజమాన్యం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అతన్ని బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపాలని యోచించారు. బుధరవారం రాత్రే ఉమేశ్ ఇండియాకు బయలుదేరినట్లు తేలింది. ఉమేశ్ యాదవ్ స్థానంలో వన్డేల్లో ఆడిన టీ నటరాజన్ను టెస్టు జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండియా జట్టు ఇద్దరు స్పీడ్ బౌలర్లను కోల్పోయింది. ఇశాంత్ శర్మ, షమీలు గాయం వల్ల ఇండియాకు తిరిగి వచ్చేశారు.