తలైవా నుంచి ఊహించని సమాధానం.. ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. పార్టీ ఏర్పాటుపై సూపర్‌స్టార్‌ రజినీకాంత్ మళ్లీ వెనక్కి తగ్గారు. ఇప్పట్లో పార్టీ పెట్టే యోచన లేదంటూ ప్రకటించేశారు. అభిమానులకు నా క్షమాపణలు అంటూ రజినీ ట్వీట్‌ చేశారు. మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకారణల దృష్ట్యా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు.

రజినీకాంత్ ఓ వైపు అన్నాత్తై సినిమా షూటింగ్ కోసం చేస్తున్న సమయంలో సెట్ లో ఏకంగా ఎనిమిది మందికి కరోనా రావడంతో సడెన్ గా వాయిదా వేసేశారు. ఇంతలో రజినీకాంత్ హైబీపీతో ఆరోగ్యం దెబ్బతినడంతో హాస్పిటల్ లో చేరారు. ఈ నేపధ్యంలో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా రజిని అభిమానులు భయపడ్డారు. తమిళనాడులో అయితే రెండు రోజుల పాటు రజినీకాంత్ అభిమానుల టెన్షన్ కి అవధులు లేవు.

హాస్పిటల్ లో చేరిన రజినికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు అతనికి కరోనా సోకలేదని నిర్ధారించిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు. తరువాత హైబీపీ కారణంగానే ఆయన ఆరోగ్యం క్షీణించింది అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. త్వరగా కోలుకుంటున్నారని చెప్పిన తర్వాత అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రెండు రోజుల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్ళిపోయారు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఇంటివద్దనే రజిని ఉంటున్నారు. అయితే ఈ నెల ఆరంభంలో తన రాజకీయ అరంగేట్రం గురించి రజిని క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలిపారు. డిసెంబర్ నెల ఆఖరున రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పారు. అభిమానులతో సమావేశం కూడా నిర్వహించారు.

అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో రాజకీయ పార్టీని ఎనౌన్స్ చేయాలనే ఆలోచనని విరమించుకున్నారు. దీనిపై అభిమానులకి క్లారిటీ ఇస్తూ ట్విట్టర్ లో ప్రకటన చేశారు.

ఏప్రిల్ లో ఎన్నికలు జరబోతున్న నేపధ్యంలో తమిళ రాజకీయాలలో రజినీకాంత్ కీలకంగా మారుతారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పార్టీ ఆలోచనని సూపర్ స్టార్ వెనక్కి తీసుకోవడం మరో సారి చర్చనీయాంశంగా మారింది.