టీకాతో ఇన్‌ఫెక్షన్‌ ఆగదు: అనుప్‌ మలానీ

కొవిడ్‌-19 టీకా పొందిన వ్యక్తికి ఆ ఇన్‌ఫెక్షన్‌ సోకదని చెప్పలేమని ఆరోగ్య, అభివృద్ధి వ్యవహారాల ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ అనుప్‌ మలానీ పేర్కొన్నారు. అయితే అతడిలో వ్యాధి తీవ్రతను తగ్గించడానికి, వేగంగా నయం కావడానికి వ్యాక్సిన్‌ దోహదపడుతుందని తెలిపారు. భారత్‌లో ఇటీవల కొవిడ్‌ కేసులు భారీగా పెరగడానికి.. రీఇన్‌ఫెక్షన్లే కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.

అనూప్‌.. షికాగో విశ్వవిద్యాలయ లా స్కూల్, ప్రిట్జ్‌కర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో బోధన విధులు నిర్వర్తిస్తున్నారు. ఐడీఎఫ్‌సీ అనే మేధోమథన సంస్థతో కలిసి భారత్‌లో కొవిడ్‌-19 సీరో అధ్యయనాలను నిర్వహిస్తున్నారు. ”గతంలో ఒకసారి కొవిడ్‌ సోకడం, టీకాలు పొంది ఉండటం వల్ల ఆ మహమ్మారి నుంచి రక్షణ లభించదు. అయితే ఆ రెండు అంశాల వల్ల లభించిన రోగనిరోధక శక్తి చాలా ప్రయోజనకరం. అలాంటివారికి ఇన్‌ఫెక్షన్‌ సోకితే వేగంగా నయమవుతుంది” అని ఆయన తెలిపారు. దీనివల్ల మరణాలు, తీవ్ర అనారోగ్యాన్ని తగ్గించొచ్చని వివరించారు. సదరు వ్యక్తి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా తగ్గుతుందన్నారు. భారీగా గుమికూడటం, అక్కడి జనాభాలో రోగ నిరోధక స్థాయి వంటివి ప్రభావం చూపుతాయని తెలిపారు. చాలామంది మాస్కులు ధరించకుండానే గుమికూడటం, త్వరగా వ్యాప్తి చెందే కొత్త వైరస్‌ రకాలు రావడం వంటి కారణాల వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతోందని తెలిపారు. కొవిడ్‌పై విసుగెత్తిపోవడం లేదా టీకా కార్యక్రమం వల్ల మహమ్మారి తగ్గుతుందన్న భావన వల్లే ప్రజలు మాస్కులు ధరించడంలేదన్నారు. తాము వ్యక్తిగతంగా వ్యాక్సిన్‌ పొందనప్పటికీ అనేకమంది ఇదే భావనతో ఉన్నారని చెప్పారు.

ఈ జాగ్రత్తలు అవసరం

మాస్కులు ధరించడం, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను పెంచడం, వ్యాధి సోకినవారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడం, పాజిటివ్‌ కేసుల్లో వైరస్‌ జన్యుక్రమాన్ని ఆవిష్కరించడం ద్వారా కరోనా రెండో ఉద్ధృతిని ఎదుర్కోవచ్చని అనుప్‌ చెప్పారు. టీకా కార్యక్రమాన్ని మరింత వేగంగా చేపట్టడం వల్ల ఫలితం ఉంటుందన్నారు. ”ఆకస్మికంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించడం సాధ్యం కాదు. అందువల్ల కరోనా కట్టడికి తెలివైన వ్యూహాలను అనుసరించాలి. మాస్కులు ధరించి, ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించొచ్చు” అని చెప్పారు.