విజయదశమి.. దసరా పండుగ, శమీపూజ విశేషాలు

చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దసరా జరుపుకుంటారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించు కునుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.

చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.

మహిషాసురుడి వధ

బ్రహ్మదేవుని వర ప్రభావంతో గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పదునేనమిది చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరు. చివరకు మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది.

విజయదశమి రోజునే శమీ పూజ

విజయదశమి రోజున శమీ పూజ నిర్వహిస్తారు. అసలు శమీ పూజ ఎలా చేయాలి తెలుసుకుందాం.

శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజిస్తారు.

శమీపూజ దగ్గర చదవాల్సిన శ్లోకం

”శమీ శమతే పాపం

శమీ శతృ వినాశనం

అర్జున్యస ధనుర్ధారి,

రామస్య ప్రియదర్శనం”

అనే శ్లోకంతో శమీచెట్టును ఆరాధించాలి. అక్కడ తెల్లపేపర్ పై మీకోరికలను, లేదా పేరు, గోత్రం రాసి ఆ చెట్టు దగ్గర పెట్టి రావడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచారంగా వస్తుంది. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి, అపరాజితా దేవిని పూజించాలి. ఇలా జమ్మిచెట్టు దగ్గర పూజ, గ్రామం పొలిమేరలు దాటి అందరూ రావడం, కొన్ని ప్రాంతాలలో పాలపిట్టను చూడటం వంటివి కూడా ఆచారంగా ఉన్నాయి. అక్కడ అందరూ ఆ చెట్టు ఆకులను ప్రసాదంగా/బంగారంగా భావించి దుర్గాదేవిని ఆరాధించి సకల విజయాలు, శుభాలు కలగాలని ప్రార్థన చేస్తారు. ఈ విధంగా చ ఆరాధిస్తే సకల శుభాలూ కలుగుతాయని ప్రతీది.