పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: చంద్రబాబు

ఏపీలో పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు అధికారికంగా వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఓ రబ్బరు స్టాంపులా మారిందని ఆరోపించారు. పరిషత్‌ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదన్నారు. ఎన్నికల బహిష్కరణ పట్ల బాధ, ఆవేదన ఉందని పేర్కొన్నారు. పరిషత్‌ ఎన్నికలపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు ఆయన గుర్తుచేశారు. అప్రజాస్వామికంగా జరిగే ఎన్నికల్లో భాగస్వాములం కాలేమని, ఎన్నికల అక్రమాలపై టీడీపీ పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు అప్రజాస్వామికంగా మారాయని ఆరోపించారు. పరిషత్‌ ఎన్నికల తేదీల వివరాలను మంత్రులు ముందే ఎలా వెల్లడిస్తారని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌గా వచ్చిన నీలం సాహ్ని వచ్చీ రాగానే ఎన్నికలపై నిర్ణయం తీసుకోవటం ఏమిటని చంద్రబాబు నిలదీశారు. గతంలో రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికలు జరిగేవని, ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా జరుగుతున్నాయని ఆరోపించారు. పాత ఎస్‌ఈసీ పదవిలో ఉండగానే పరిషత్‌ ఎన్నికల తేదీలను, కౌంటింగ్‌ వివరాలను మంత్రులు ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించారు. గతంలో 2 శాతం ఎంపీటీసీలే ఏకగీవ్రం అయ్యేవని, ఇప్పుడు 20 శాతానికిపైగా అయ్యాయని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేస్తామంటే పోలీసులు వచ్చి బెదిరించారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఎక్కడ చూసినా బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఉండవని వలంటీర్లు బెదిరించారు. తాజా పరిస్థితులు చూస్తే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదని చంద్రబాబు పేర్కొన్కారు.