దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడున్నా కొనుగోలు చేస్తాం: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. థర్మల్‌ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులతో సమీక్షించారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడున్నా కొనుగోలు చేయాలన్నారు. బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలన్నారు.

కృష్ణపట్నం, వీటీపీఎస్‌ల్లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాలమేరకు బొగ్గును తెప్పించుకోవాలని సీఎం సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.