అంధకారంలోకి వెళ్లిపోతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

• అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగం కావాలి
• రాజకీయంగా జనసేన పార్టీ ఓ స్వచ్ఛమైన వేదిక
• 100 శాతం జనసేన జెండా మోసేందుకు సిద్ధమవ్వాలి
• మూడు నెలల్లో పార్టీతో మమేకమయ్యే ప్రక్రియ పూర్తి చేద్దాం
• మెగా అభిమాన సంఘాల నాయకులతో సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

అంధకారంలోకి వెళ్లిపోతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని, అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగంగా మారి బాధ్యత తీసుకుని మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. రాజకీయంగా జనసేన పార్టీ రూపంలో ఒక క్లీన్ ప్లాట్ ఫామ్ మనకు ఉందని, పార్టీని గెలిపించుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మఖ్యమంత్రి చేయడానికి అంతా కలసి రావాలన్నారు. ఈ ప్రయాణంలో ఎక్కడా బేధాభిప్రాయాలు లేకుండా కలసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ప్రతినిధులు శ్రీ మనోహర్ గారితో సమావేశమయ్యారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడు ఆధ్వర్యం వహించారు. జనసేన పార్టీ విజయంలో తమవంతు పాత్ర పోషించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం అభిమాన సంఘాల నాయకులను ఉద్దేశించి శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. “సమాజానికి ఏదో విధంగా సాయపడాలి అనే బలమైన కోరిక శ్రీ చిరంజీవి గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. మంచి కార్యక్రమాలు చేయడంతోపాటు నిజాయతీగా ఉండాలి. సేవా కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే రాజకీయ పార్టీగా ఎలా ముందుకు వెళ్లాలి… ఎలా బలపడాలి అనే అంశం మీద దృష్టి సారించడం ముఖ్యం. అభిమాన సంఘాలకు, రాజకీయాలకు తేడా ఉంటుంది. రాజకీయంగా ప్రతి రోజూ గొడవలు ఉంటాయి. దానికి సిద్ధపడాలి.
• ఇటువంటి పాలన ఎప్పుడూ చూడలేదు
ఇప్పుడు జనసేన పార్టీలో ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పార్టీపరంగా ఏ నిర్ణయం తీసుకున్నా వందసార్లు ఆలోచించి తీసుకుంటున్నాం. ఆ నిర్ణయం ఎంత మందికి ఉపయోగపడుతుంది. ఎంత మందికి ఇబ్బంది కలుగుతుంది అనే అంశాలపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం. ఏ నిర్ణయం తీసుకున్నా బహిరంగంగా మాట్లాడాలి అనే స్థాయిలో పాలసీలు తీసుకువస్తున్నాం. రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఇటువంటి పాలన ఎప్పుడూ చూడలేదు. ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకుని ఆయనకు నష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎంతో మంది నష్టపోయారు. సినీ రంగాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా బలంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాం. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తోంది.
• త్వరలో జిల్లా, మండల స్థాయిలో సమావేశాలు
అభిమాన సంఘాలుగా మీ ఆలోచనల్లో స్పష్టత అవసరం. 100 శాతం జనసేన జెండా మోసేందుకు సిద్ధంగా ఉండాలి. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీని తీసుకువెళ్లాలి. పార్టీ కార్యవర్గంతో పూర్తి స్థాయి కలయిక ఏర్పడడానికి మీకు కొంత సమయం పడుతుంది. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఈ తరహా సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం. ప్రస్తుతం 9 జిల్లాలకు అధ్యక్షులు, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీల ఏర్పాటు పూర్తయ్యింది. వారి వివరాలు తీసుకుని వారితో కలవండి. రాబోయే రోజుల్లో జిల్లాల అధ్యక్షులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీ ప్రయాణంలో మీకు ప్రత్యేక స్థానం కల్పించే ఏర్పాటు చేసుకుందాం. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి కిట్ల పంపిణీ కార్యక్రమం త్వరలో ప్రారంభం అవుతుంది. వచ్చే నెల నుంచి వారికి శిక్షణ తరగతులు ఉంటాయి. అందులో అభిమాన సంఘాలు భాగస్వాములు కావాలి. మూడు నెలల్లో క్షేత్ర స్థాయిలో అభిమాన సంఘాలను పార్టీలో కలిపే ప్రక్రియను పూర్తి చేద్దాం. అందుకు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం. మనం ఏ కార్యక్రమం చేసినా అది రాజకీయంగా ఉపయోగపడాలి. సమాజానికి ఉపయోగపడే మనుషులుగా, సైనికులుగా మన ప్రయాణం ఉండాలి. ఈ ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయి. దానికి సిద్ధపడి ముందుడుగు వేయండి. మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీల్లో మీకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చూస్తాం” అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, అభిమాన సంఘాల ముఖ్య నాయకులు పగడాల మురళీకృష్ణ, విశ్వనాథ్, కొట్టే వెంకటేశ్వర్లు, మేడిశెట్టి సూర్యకిరణ్, ఆళ్ళ హరి, పాదం మూర్తినాయుడు, శోడిశెట్టి కృష్ణప్రసాద్, లకనం శ్యామ్ ప్రసాద్, సుగుణబాబు తదితరులు పాల్గొన్నారు.