మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాల్లో విషమిస్తున్న పరిస్థితి, లాక్‌డౌన్ దిశగా నాగ్‌పూర్

దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మహారాష్ట్రతో పాటుగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో సైతం పరిస్థితి చేయి దాటనుందని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.

కరోనా వైరస్ సెకండ్ స్ట్రెయిన్ లేదా కరోనా వైరస్ కొత్తరకం కేసులు రోజురోజుకూ భయపెడుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్  రెండోదశ జరుగుతుండగానే కరోనా కొత్తరకం వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర పరిస్థితి విషమంగా మారుతోంది.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్‌కు సిద్ధమౌతోంది మహారాష్ట్రతో పాటు గుజరాత్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి చేయి దాటనుందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర పరిస్థితి సీరియస్‌గా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకవద్దని మహారాష్ట్ర  పరిస్థితి స్పష్టం చేస్తోందని చెప్పారు. మరోవైపు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దని తెలిపారు. దేశవ్యాప్తంగా 1 లక్షా 89 వేల 226 యాక్టివ్ కేసులుండగా..ఒక్క మహారాష్ట్రలోనే లక్షకు పైగా కేసులున్నాయి. అదే విధంగా యాక్టివ్ కేసుల్లో బెంగళురు అర్బన్, పూణే, అమరావతి, జల్‌గావ్, నాసిక్, ఎర్నాకులం, ఔరంగాబాద్, నాగ్‌పూర్, థానే, ముంబై ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పరిస్థితి ఇప్పటికే చేయి దాటిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ డెత్ రేటు తగ్గిందని..రికవరీ రేటు పెరుగుతోందని  కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో 2 కోట్ల 56 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల వాటా 7 శాతం కాగా, ప్రైవేటు ఆసుపత్రుల వాటా 28.77 శాతంగా ఉందన్నారు.